ఐఫోన్తో చిత్రీకరణ, ఏఐ సాంకేతికతతో రూపొందిన ‘మిషన్ మాయ’ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ
డైలాగ్ కింగ్ సాయికుమార్, నటుడు ఆలీ చేతుల మీదుగా ‘మిషన్ మాయ’ పోస్టర్ లాంచ్
తెలుగు సినీ పరిశ్రమలో నూతన ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో పిజె ప్రొడక్షన్స్ సంస్థ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రవీణ్ జోల్లు నిర్మాణంలో, ఖుషి రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘మిషన్ మాయ’. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర పోస్టర్లను డైలాగ్ కింగ్ సాయికుమార్, నటుడు ఆలీ, మామిడి హరికృష్ణ గార్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని పూర్తిగా ఐఫోన్తో చిత్రీకరించడం ఒక విశేషం కాగా, ఆధునిక ఏఐ సాంకేతికతను విరివిగా ఉపయోగించడం మరో ప్రత్యేకత.
మామిడి హరికృష్ణ గారి మాటల్లో…
“అందరికీ నమస్తే. తెలుగు చిత్రసీమలో కొత్త సాంకేతికతలు, విజువల్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఉపయోగించి సినిమాలు తీయడంలో మనవాళ్లు ఎప్పుడూ ముందుంటారు. ‘మిషన్ మాయ’ చిత్రంలో ఏఐ సాంకేతికతను అద్భుతంగా వినియోగించారు. చిత్ర శీర్షిక కూడా ఆకర్షణీయంగా ఉంది. ఐఫోన్తో పూర్తి చిత్రీకరణ జరపడం ఈ సినిమా ప్రత్యేకత. సృజనాత్మకత, కంప్యూటర్ నైపుణ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మేళనంతో రూపొందిన ఈ చిత్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మిస్టరీ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.”
దర్శకుడు ఖుషి రావు మాట్లాడుతూ…
“ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనించి, ఒక నవీన ఆలోచనతో సినిమా రూపొందించాలని నిర్ణయించాము. సాంప్రదాయ పద్ధతిలో సినిమా చేయడం సాధారణమే, కానీ మేము ఏఐ సాంకేతికత, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతంతో ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తీసుకొచ్చాము. ఇటువంటి ప్రయోగంలో భాగస్వాములైన నటీనటులు, మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చిన నిర్మాత ప్రవీణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఏఐ సాంకేతికతతో ఐఫోన్లో రూపొందిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని ఆశిస్తున్నాము.”
నిర్మాత ప్రవీణ్ జోల్లు మాట్లాడుతూ…
“ఐఫోన్తో చిత్రీకరణ చేస్తూ, సాంకేతికత సాయంతో ఒక సినిమా తీయాలని భావించాము. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో, ఎంత సహకరించారో నాకు బాగా తెలుసు. ఈ చిత్ర నిర్మాణంలో ఖర్చు లేదా ఇతర అంశాల గురించి నేను ఆలోచించలేదు. కేవలం ఈ బృందం కోసం ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాను. అడవిలో మొబైల్ ఫోన్తో సినిమా తీయడం దర్శకుడికి సవాల్తో కూడిన పని. అయినా, అందరి సమిష్టి కృషితో ఈ చిత్రాన్ని పూర్తి చేశాము.”
సత్యనారాయణ గారు మాట్లాడుతూ…
“మాకు సహకరిస్తున్న మీడియా సోదరులకు నా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు ఐఫోన్తో సినిమా తీయాలనే ఆలోచనతో మొదలుపెట్టాము. సహజసిద్ధమైన దృశ్యాల కోసం నిజమైన అడవిలో చిత్రీకరణ చేశాము. నిర్మాత గారు మా బాగోగులు జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శకుడు ఖుషి గారు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ప్రతి నటీనటుడిని ఆడిషన్ ద్వారా ఎంపిక చేశాము.”
ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో సాంకేతికత మరియు సృజనాత్మకతకు కొత్త ఒరవడిని సృష్టించనుంది.


















































